అతీత శక్తులు ప్రకటించే అనేక ప్రకృతి స్వరూపములకు భక్తిప్రపత్తులతో నమస్కరిస్తూ, మన రక్తంలో ప్రవహించే ధర్మమును మనం నమ్ముదాం.
మానవ జన్మ ఎత్తి, జీవిత కాలము గడిచి పోయిన తర్వాత ప్రాణ రహిత, చలనరహిత శరీరమునకు అంతిమ సంస్కారములలో భాగంగా హిందూ ధర్మంలో దహన కార్యము పాటించి ఆ శరీరం పంచభూతములతో కలిసే కార్యక్రమం నడుస్తుంది. కానీ కొందరు అవతార మూర్తులు, సిద్ధపురుషులు జీవిత కాలంలో మహిమలు చూపించి సాక్షాత్తూ దైవ స్వరూపులుగా భావించబడిన కొందరు మహనీయులు, ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య మానవుల కంటే విశేష జీవనం గడిపిన వారి పార్థివ శరీరములు మరణానంతరం సమాధి చేయబడతాయి. అనేక ఇతర మతముల వారు కూడా సమాధి ఆచారములు పాటిస్తారు.
సమాధి అనంతరము ఈ మహా పురుషులు తమ మహిమలు చూపుతూ భక్తులను కాపాడటం మనలో కొందరికి అనుభవ గతమే. తెలుగువారికి పరిచయమైన కొందరు సాధు పుంగవుల మహిమలు స్మరించుకుందాం. వాటిలో అనేకమంది దర్శించే స్థలంగా మహారాష్ట్రలోని షిర్డీ ఉంది. ఇంకా మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కూడా చాలామంది దర్శిస్తారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం, పొదలకూరు దగ్గర కల జ్యోతి క్షేత్రంలోని కాశీనాయన సమాధి కూడా ఉన్నాయి.
ఇతర మతములకు చెందిన సాధుపురుషుల సమాధులు కల ప్రార్థన స్థలములు అన్యమతముల వారిని ఆకర్షించడం, వారి కోరికలు తీరి సంతోషంగా ఉండటము మనం గమనిస్తాం. దైవంతో పాటు దైవ లక్షణములు కలిగిన మహాపురుషుల సమాధి స్థలములు ఆర్తులకు మానసిక స్వాంతన కలుగజేస్తాయనుటలో సందేహం లేదు. సమాధి అనంతరం మహాపురుషుల శరీరములు ప్రకృతి శక్తులతో కలిసిపోయి వారి రూపం లేకపోయినా, సహాయపడే లక్షణములు మారవు.
మహనీయుల సమాధి ప్రదేశాల దర్శనము శుభకరం. సమాధి అనంతరం ఆర్తుల రక్షణ అభినందనీయం. వారికి ప్రణామములు.
No comments:
Post a Comment